ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గడగడ వణికించిన కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా త్వరలో పంపిణీ చేయనున్న కరోనా వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 40 వేలకు పైగా ఉన్న R.M.P,P.M.P లకు ఇవ్వాలని హుజూర్ నగర్ నియోజకవర్గ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ కేంద్రంలో శనివారం జరిగిన RMP,PMP కమిటీ సమావేశంలో మన్సూర్ అలీ మాట్లాడారు.
ఆర్.ఎం.పి లు, పి.ఎం పి,గ్రామీణ వైద్యులు రేయనక,పగలనక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు, సలహాలు, సూచనలు అందిస్తూ కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించి సకాలంలో వైద్యం అందించి ప్రజల ప్రాణాలను కాపాడారని అన్నారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు జాగ్రత్తలు సూచనలు చేశారని,RMP లు కరోనా రోగులకు తక్షణ వైద్యం అందించి కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారన్నారు.
గ్రామాలలో, తండాల్లో, మురికివాడలలో నిత్యం ప్రజలతో కలసి మెలసి వైద్య సేవలు అందిస్తూ కరోనా నివారణ కొరకు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిలా పని చేసిన ఆర్.ఎం.పి, పి.ఎం.పి గ్రామీణ వైద్యులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం తగదని అన్నారు.
ఇప్పటికైనా ఆర్.ఎం.పి,పి.ఎం.పి ల సేవలను గుర్తించి జిల్లా,మండల వారీగా గ్రామీణ వైద్యుల జాబితాను రూపొందించి మొదటి ప్రాధాన్యతా క్రమంలో కరోనా వ్యాక్సిన్ అందించి న్యాయం చేయాలని అన్నారు.ఈ మేరకు సీఎం కేసీఆర్ ను ట్విట్టర్ ద్వారా కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మండల ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు, కోశాధికారి ఆత్కూరి శ్రీను, సీనియర్ ఆర్.ఎం.పి లు, గ్రామీణ వైద్యులు సిహెచ్.కోటేశ్వరరావు, షేక్. బాబు, కమిటీ సభ్యులు పి. పూల రాజు, పి.బ్రహ్మం, ఎం.శివాది నారాయణ, కడియాల రమేష్, జడ అంజి, షేక్ రఫీ, ఎండి ఖాజా మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.