ఇటీవల తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహిళశక్తి కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో విజయవంతంగా ముగించారు. అంతే కాకుండా రాష్ట్ర స్థాయిలో నెల్లూరు మహిళలు ప్రథమ స్థానంలో నిలిచారు. నగర ప్రజల్లో ఈ కార్యక్రమం వలన టీడీపీ పట్ల సానుకూల దృక్పధం ఏర్పడింది. దీంతో మహిళ బృందాన్ని నగర టీడీపీ ఇంచార్జి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి అభినందించారు. నారాయణ మెడికల్ కళాశాలలోని క్యాంప్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేసి మహిళశక్తి టీమ్ ని చీరలు,పసుపు కుంకుమతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి పొంగూరు నారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరైతే కష్టపడతారో వారికి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందన్నారు. బూత్ లెవల్లో విస్తృత తనికీలు చేస్తామని చెప్పిన నారాయణ… ప్రజలకు పార్టీ లక్ష్యాలు చేరువ చేయాలని సూచించారు. మహిళలు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా అండగా ఉంటామని,కష్ట నష్టాలలో తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ… నారాయణ వచ్చాక పార్టీ కెడర్లో కొత్త హుషారు వచ్చిందన్నారు. ఆయనొక రాజకీయ నీతిజ్ఞుడు అని కొనియాడుతూ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేశారు.
రానున్న ఎన్నికల్లో విజయం ఖాయం అని చెప్పిన కోటంరెడ్డి…. 50 వేలకు పైగా మెజారిటీ ఇచ్చేలా కృషి చేయాలని మహిళ నేతలకు సూచించారు. మరోసారి నారాయణ మంత్రి అయితే చెన్నై, హైద్రాబాద్ నగరాల తరహాలో నెల్లూరు అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నారాయణ సతీమణి రమాదేవి, మహిళ నేతలు తాళ్ళపాక అనురాధ, విజేత, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.