ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అన్ని రాజకీయ పార్టీలూ విఫలం కావడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ సిఫార్సు చేశారు. గవర్నర్ సిఫార్సుల నేపధ్యంలో నేటి మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం సమావేశం అయింది. మహారాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ విఫలం అయినందున రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. రాష్ట్రపతి తదుపరి ఆదేశాల కోసం అందరూ వేచి చూస్తున్న సమయంలో శివసేన సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అడిగినంత గడువు ఇవ్వకుండా గవర్నర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఇది రాజ్యాంగ విరుద్ధమని శివసేన అంటున్నది. మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 స్ధానాల మేజిక్ ఫిగర్కు చాలా దూరంలో నిలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి కనబరచలేదు. రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను గవర్నర్ ఆహ్వానించినా బలనిరూపణకు డెడ్లైన్ పొడిగించాలన్న వినతిని గవర్నర్ తోసిపుచ్చారు. ఇక మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందింది. ఈ దిశగా ఎన్సీపీ..కాంగ్రెస్, శివసేనలతో సంప్రదింపులు జరుపుతుండగానే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడం, ఇందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి.
previous post