42.2 C
Hyderabad
April 30, 2024 15: 39 PM
Slider ఆధ్యాత్మికం

గరళ కంఠాయనమహ: ఉపవాసం, జాగారం ఎందుకు చేయాలి?

sivaratri spl

హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి.  మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి అని పురాణాలు  చెబుతున్నాయి. మహా శివరాత్రికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి అని చెబుతుంటారు.

శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి  శివుడిని దర్శించుకుని, పూలు, ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. శివుడు భోళా శంకరుడు.

భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను అనుగ్రహిస్తాడు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం  చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టిందని, హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారట. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు.

లోక రక్షణ కోసం ఆగరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి అలా శివుడు గరళకంఠుడయ్యాడు.  హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా కూడా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ  తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు.

నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు అని పురాణాలు చెప్తాయి.  హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు  మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు.

జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన  పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది. శివారాధనలో మూర్తి రూపం, లింగరూపంలోనూ పూజిస్తారు.

ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు  ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. శివరాత్రి రోజు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన  చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు.

Related posts

ప్రగతి దివ్వెలు

Satyam NEWS

ఒక్క రోజులో దిశ యాప్ ను ఎంత‌మంది డౌన్ లోడ్ చేసుకున్నారో తెలుసా..?

Satyam NEWS

కీలక కేసుల్లో క్వాలిటీ ఇన్ వెస్టిగేషన్ ఉండాలి

Satyam NEWS

Leave a Comment