వై.ఎస్.ఆర్ జిల్లాలోని మైదుకూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బు రాజన్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరిసరాలు పరిశీలించారు. ఆవరణలో పచ్చదనం పెంపొందించాలని, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మైదుకూరు రూరల్ సి.ఐ నరేంద్ర రెడ్డి ని ఆదేశించారు. సర్కిల్ కార్యాలయ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం రూరల్ సర్కిల్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. దొంగతనాలు అరికట్టేందుకు గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల సమన్వయంతో నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణాపై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రూరల్ సర్కిల్ లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళల భద్రత కు పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘దిశ’ యాప్ పై అవగాహన కల్పించి డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్టర్డ్ యూజర్ గా నమోదు చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ వెంట మైదుకూరు డి.ఎస్.పి ఎస్.ఆర్ వంశీధర్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.