కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తా లో దహనం చేశారు.
రైతులు పగలనక రేయనక కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతు కుటుంబాలు వేలాదిగా వీధిన పడుతున్నాయని మాలల చైతన్య సమితి తెలిపింది.
అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు లకు వ్యతిరేకంగా బడాబాబులకు అనుకూలంగా తెచ్చిన ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ లో 41 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఎముకలు కొరికే చలి లెక్కచేయకుండా పోరాడుతున్న రైతులకు వారు సంఘీభావం వ్యక్తం చేశారు.
రైతులు ప్రాణాలు కోల్పోతున్నా కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమం పట్ల సానుకూలంగా స్పందించక పోవడం శోచనీయమని అన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పత్తి యాదయ్య, ఎం వెంకట్, రాములు, రాజయ్య, నాగయ్య, పత్తి శ్రీను, కాంతారావు, ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.