స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కు సంబంధించి కొందరు ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన అభ్యంతరాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న ఉద్యోగుల భద్రతకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నదని స్పష్టం చేశారు.
కరోనాకు సంబంధించిన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలలో స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బందికి పిపిఇ సూట్లు, ఫేస్ షీల్డ్ లు, చేతికి గ్లౌజెస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు రమేష్ కుమార్ తెలిపారు.
కోవిడ్ 19 మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇతర రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణ లో తీసుకున్న కరోనా జాగ్రత్తల మాదిరిగానే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా తీసుకోవాలని, అందరికి శిక్షణనివ్వాలని ఆయన ఆదేశించారు.
అదే విధంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే ఇస్తున్నందున సామాజిక బాధ్యతగా ముందు ఎన్నికల నిర్వహణ సిబ్బందికి ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆరోగ్య శాఖ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందుకు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో బాటు గ్రామ స్థాయిలో ఉన్న సామాన్య ప్రజలు కూడా ఎన్నికల పట్ల ఉత్కంఠతతో ఉన్నారని ఆయన తెలిపారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తామని సామాజిక నాయకత్వం పెంపొందించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆర్ధిక సంఘం నిధులు మంజూరు కావడానికి ఎన్నికల నిర్వహణ తప్పని సరి అని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. వరదలు తుపానులు ఇతర ప్రకృతి వైపరిత్యాల సందర్భంగా ఎంతో సమర్ధంగా పని చేసే ట్రాక్ రికార్డు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా విజయవంతం చేయాలని ఆయన కోరారు.