ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని నవీన్ అలియాస్ తీన్ మార్ మల్లన్న హైకోర్టు లో మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఉంటున్న ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, అప్పటి నుండి సీఎం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లారని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం రాష్ట ప్రజలకు ఉందని ఆయన అన్నారు.
ప్రభుత్వం లో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి లేకపోవడం వలన సక్రమంగా పనిచేయడం లేదని పిటీషనర్ పేర్కొన్నారు. గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదని అందువల్ల రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారని పిటీషనర్ పేర్కొన్నారు.
కరోనా ను కట్టడి చేయడం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేసారు. అనేక మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు ధైర్యం చెప్పారు ఇప్పుడు ఆయనే కనిపించకుండా పోవడంతో అయోమయం నెలకొన్నదని పిటీషనర్ తెలిపారు.