వివిధ శాఖల అధికారులను ఆదేశించిన కలెక్టర్ సూర్యకుమారి
మన్యం జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమాయత్తంగా ఉండాలని, అన్ని సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేసుకొని ఉగాది నాటికి సంసిద్ధంగా ఉండాలని ఏపీలోని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. ఎలాంటి జాప్యం జరగకుండా ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటవుతున్న నేపథ్యంలో కలెక్టర్ అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులతో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిబ్బంది కేటాయింపు, సర్ధుబాటు అంశంలో అనుసరించాల్సిన విధానాలపై ఆమె పలు మార్గదర్శకాలు చేశారు. అన్ని సాంకేతిక ప్రక్రియలు త్వరితగతిన పూర్తి చేసుకొని వచ్చే నెల 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలో పాలన సాగించేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ లోపు ఆయా శాఖల ఉన్ తాధికారులతో చర్చించి సిబ్బంది కేటాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి కొత్తగా డివిజన్ కలుస్తున్నందున ఆయా శాఖల అధికారులు ఒకసారి పరిశీలించి సంబంధిత చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి 62 కార్యాలయాలు గుర్తించి కేటాయించామని, ఆయా శాఖల అధికారులు ఒకసారి పార్వతీపురం వెళ్లి పరిశీలించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
బొబ్బిలిలో కొత్తగా డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన శాఖల అధికారులు త్వరితగిన స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. నూతన సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యేనాటికి ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి బడ్జెట్ ఉండి ముందుకు వచ్చే వారికి స్థలం కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆడిట్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసుకొని.. పూర్తి వివరాలను అందించాలని సూచించారు.
కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఐటీడీఏ పీవో కూర్మనాథ్ తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించి స్థానికంగా ప్రైవేటు భవనాలను గుర్తించామని పేర్కొన్నారు. కొన్ని విభాగాలకు ఆర్.సి.ఎం. పాఠశాలలో, మరికొన్ని విభాగాలకు నారాయణ పాఠశాల ఎదురుగా ఉన్న నిర్మలా ఎన్క్లేవ్ లో కార్యాలయాలు కేటాయించినట్లు పీవో వివరించారు.
ఒకటి, రెండు రోజుల్లో ఆయా శాఖలకు సంబంధించి రూమ్ నెంబర్లను వేసి కార్యాలయాలు అప్పగిస్తామని, అనంతరం సామాగ్రిని తరలించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఎవరికైనా కార్యాలయాలు కేటాయించలేనట్లయితే తమను సంప్రదించాలని సూచించారు. అందరూ అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 2వ తేదీ నాటికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు కిశోర్ కుమార్, మహేశ్ కుమార్, వెంకటరావు, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన, డీఆర్వో గణపతిరావు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.