కడప జిల్లా లో న్యూ రిమ్స్ లో సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరిగింది.
తన కళాశాల నుండి తయారు చేయించి ప్రతిరోజు దాదాపు 500 మందికి తగ్గకుండా రోజుకొక వెరైటీ భోజనం తో కరోనా బాధితులకు, సహాయకులకు సాయం చేస్తున్నట్లు గోవర్ధన్ రెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ సెల్ కు అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలకు తనకు తోచిన రీతిలో ప్రతి సోమవారం అన్న ప్రసాద వితరణ చేస్తున్నానని ఆయన తెలిపారు.
తరువాత గ్రీవెన్స్ సెల్ రద్దు చేయడం వలన ఆ కార్యక్రమాన్ని నిలిపివేశామని, ఈ కరోనా సమయంలో పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టేందుకు ముందుకు వచ్చామని అన్నారు.
ఇప్పటి పరిస్థితులలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు కొనసాగించి వుంటే పేదలకు పట్టెడన్నం దొరికేది అన్నారు.
కనుక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవాలని ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి సూచించారు.
కర్ఫ్యూ సడలించే వరకు పేద ప్రజలకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని ఆయన మీడియాతో చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు పోతుగంటి పీరయ్య,మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఖాసిం, బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి,వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.