కారుణ్య నియామకాల్లో కొడుకు ఎంతో, కూతురు కూడా అంతే అని జస్టిస్ దేవానంద్ తీర్పు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా చిన్నమ్మ అనే మహిళ పటిషన్ పై ఏపీ హైకోర్ట్ ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఆర్టీసీ డ్రైవర్ గా ఉన్న చిన్నమ్మ భర్త 2009లో మృతి చెందాడు.
భర్త మృతితో కారుణ్య నియామకానికి చిన్నమ్మ దరఖాస్తు చేసుకున్నది. అయితే ఉద్యోగానికి సరైన అర్హత లేదంటూ చిన్నమ్మ దరఖాస్తును ఆర్టీసీ తిరస్కరించింది. దాంతో తన వివాహిత కూతురు దమయంతికి ఉద్యోగం ఇవ్వాలని చిన్నమ్మ మరో అభ్యర్థన పంపింది.
అయితే వివాహిత అయిన కూతురు కు కారుణ్య నియామానికి అర్హత లేదంటూ మరోసారి ఆర్టీసీ తిరస్కరించింది. దాంతో 2014లో హైకోర్టును చిన్నమ్మ ఆశ్రయించింది. బ్రెడ్ విన్నర్ స్కీం కింద ఉద్యోగి మరణిస్తే కుమారుడు లేదా అవివాహిత అయిన కూతురికి మాత్రమే ఉద్యోగ కల్పన ఉంటుందని ఆర్టీసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
1999లో జారీ చేసిన 350 జీవో ప్రకారం ఒక కూతురు ఉండి ఉంటే వివాహిత అయినా ఉద్యోగ కల్పన ఉంటుందని 2003లో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి గుర్తు చేశారు. పెళ్లయినా సరే తల్లిదండ్రులతో కుమార్తె అనుబంధం విడదీయరానిదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
అవివాహితకే కారుణ్య నియామకాలనే నిబంధన ఇకపై చెల్లదనిఆయన అన్నారు. చిన్నమ్మ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఉద్యోగం కల్పించాలని ఏపీ హైకోర్ట్ ఆదేశించింది.