మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్ను ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. కరోనా కారణంగా 11 ప్రశ్నపత్రాలకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించనుండడం విశేషం.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్నందున పని దినాలు, బోధన, పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ తదితర అంశాలతో ప్రతిపాదిత క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
పది పరీక్షలపై భిన్నాభిప్రాయాలు
కాగా పరీక్షల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వినబడుతుండడం విశేషం. ఇంకా తరగతులే ప్రారంభం కాలేదని ఇప్పటికే కరోనా కారణంగా వివిధ రకాలైన ఒత్తిళ్ళలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉన్నారని, ఈ సారి కూడా పది పరీక్షలను గతంలో విద్యార్థులను పై తరగతులకు పంపిన విధానాన్నే అనుసరించాలని పలువురు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.
విద్యాపరంగా జీరో సంవత్సరం?!
ఏది ఏమైనా కరోనా సమయంలో చదువుల తల్లికీ కష్టాలు ఏర్పడడం అందరికీ తెలిసిందే. కేవలం 8, 9, 10 తరగతులకు పరీక్షలు నిర్వహించి మిగతా విద్యార్థులకు నిర్వహించకుండా ఉండడం సబబు కాదని కొంతమంది అంటుంటే, మరికొందరేమో అసలు ఈ సంవత్సరాన్ని విద్యాపరంగా చూసుకుంటే పూర్తిగా జీరో సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించడం మంచిదనే వాదనలూ వినిపిస్తున్నాయి.