ప్రజాసమస్యలపై నిరంతరం ముందుండి పోరాడే ఓ యువ నాయకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. కామారెడ్డి జిల్లా ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి తేలు రాజలింగం(45) ఆకస్మిక మృతి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను విషాదంలో నింపింది.
కామారెడ్డి నుంచి బిబిపేటకు తన హోండా బైకుపై వెళ్తుండగా పొందుర్తి చెక్ పోస్టు వద్ద డివైడర్ ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రాజలింగంను జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్యులు అతన్ని బ్రతికించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చివరికి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
రాజలింగం మృతితో జిల్లాలోని వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, రైతు, దళిత సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.