మేడారం జాతర కు సంబంధించి చేపట్టిన శాశ్వత పనులన్నీ సంక్రాంతి లోగా పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని మేడారం ఐటి డి ఎ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్లు పి శ్రీజ, డి వేణుగోపాల్ లతో కలసి సంబంధిత శాఖ అధికారులు, గిరిజన సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం సంబంధ పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులు మేడారం లో క్షేత్ర స్థాయిలో ఉండాలని, పనుల పురోగతి పై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని అన్నారు. విధులు కేటాయించబడిన ఎఇ, డిఇలు మేడారంలోనే ఉండి, పనులు చేపట్టాలని, ఈఈలు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం క్షేత్ర సందర్శన చేసి, పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. ప్రతి శాఖకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయేట్లు, పనులు క్షేత్ర స్థాయిలో ప్రారంభించెట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి శాఖ డిఇ, ఎఇలు చేపడుతున్న పనుల పురోగతికి సంబంధించిన ఫోటోలు గ్రూపులో పోస్ట్ చేయాలన్నారు.
మేడారం జాతరకు సుమారు కోటి యాభై లక్షల భక్తులు రానున్నట్లు అంచనా ఉన్నట్లు, ప్లాస్టిక్ ఫ్రీ మేడారం కు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు, వన దేవతల పండుగ, వనంలో పండుగ, చుట్టూతా వనం, ప్రక్కనే వన్య ప్రాణులు కాబట్టి, వనాన్ని, వనంలోని ప్రాణులను కాపాడుకొనే దిశగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ములుగు వ్యాపారులు, మేడారం లో వ్యాపారం చేసుకొనే వారికి ముందుగానే అవగాహన కల్పిచాలని, ముందే ప్రత్యామ్నాయ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఎంతలో దొరుకుతాయి వివరాలు తెలుపుటకు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
మేడారం భూమిలో ఒక్క ప్లాస్టిక్ ముక్క పడకుండా చూసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివాసీ పండుగ, ఆదివాసీ సాంప్రదాయం పరిరక్షిస్తూ, ప్రపంచానికి చాటి చెప్పేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. గిరిజన గ్రామం ఏర్పాటు చేసి, గిరిజన సంస్కృతి ని చాటుతామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిలకలగుట్ట నుండి ఊరటం మార్గమధ్యంలో పార్కింగ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఈ సమావేశంలో ఈవో రాజేందర్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత, డిపిఓ వెంకయ్య, డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, ఇంజనీరింగ్ అధికారులు, తహసిల్దార్, ఎంపీడీవో, గిరిజన సంఘా నేతలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.