బోదవ్యాధి రాకుండా ఉండేందుకు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా, డీఈసీ మాత్రలను వేసుకోవాలనివి విజయనగరంజిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్వి రమణకుమారి కోరారు. నగరంలోని జిల్లా బోదవ్యాధి నివారణా కార్యాలయం వద్ద, ఫైలేరియా నివారణ మాత్రలను వేసుకునే మూడు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం డీఎంఅండ్హెచ్ఓ రమణకుమారి మాట్లాడుతూ, వ్యాధి చికిత్స కంటే నివారణ మేలని స్పష్టం చేశారు.
జిల్లాలో బోద వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతీఏటా డీఈసీమాత్రల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒకేసారి జిల్లాలోని అందరికీ మాత్రలను పంపిణీ చేసి, మింగించడం ద్వారా, ఈ వ్యాధి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో కొన్ని చోట్ల ఫైలేరియా వ్యాధి ఉందని, వ్యాధిగ్రస్తులకు చికిత్సతో పాటు, శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నామని చెప్పారు.
వ్యాధి వచ్చిన తరువాత బాధ పడేకంటే, ఇది రాకుండా ముందస్తుగా డిఇసి మాత్రలను తీసుకోవడం మేలని సూచించారు.అనంతరం జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి మాట్లాడుతూ, డీఈసీ మాత్రలను ఆహారం తీసుకున్న తరువాత ఈ మాత్రమే మింగాలని సూచించారు.
ఎవరికైనా కొద్దిగా జ్వరం, వాంతులు వచ్చేటట్టు అనిపించినా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లాలో ఈ విడత 23,42,048 మందికి డిఇసి, ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, సీనియర్ ఎంటమాలజిస్ట్ డి.సాంబమూర్తి, మలేరియా కన్సల్టెంట్ రామచంద్రుడు, అర్బన్ ఫైలేరియా యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.