రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాల ఇన్చార్జ్లను భర్తీ చేస్తూ వస్తోన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి విషయంలో మాత్రం ఇంతకాలం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. 2014లో విజయం దక్కించుకున్న కోడెల శివప్రసాదరావు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన మరణం పార్టీకి పెద్ద లోటుగా మారింది. అప్పటి నుంచి కూడా ఈ సీటులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరినీ నియమించ లేదు. ఎప్పటికప్పుడు ఈ సీటును మాకివ్వండి.. అంటే మాకివ్వండి.. అంటూ.. వినతులు వస్తున్నా.. బాబు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాగోతు శౌరయ్య ఈ టికెట్ను ఆశిస్తూ.. పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. వాస్తవానికి ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే అయినప్పటికీ… మధ్యలో రోమన్ కాథలిక్(క్రిస్టియన్ మైనారిటీ) మతం తీసుకున్నా రు. నకిరికల్లు మండలం, తురకపాలెంకు చెందిన ఆయన సత్తెనపల్లికి స్థానికుడు కావడం గమనార్హం. అంతేకాదు.. 2001-2006 వరకు నకరికల్లు మండల పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. అదేవిధంగా రాష్ట్ర మండల పరిషత్ అధ్యక్షుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా కూడా పనిచేశారు. 1988లోనే రాజకీయాల్లోకి వచ్చిన శౌరయ్య.. అప్పట్లో పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యారు.
తెలుగు దేశం పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా 2008-14 వరకు పనిచేశారు. ఇలా మొత్తంగా 28 ఏళ్లుగా ఆయన ప్రజాజీవితంలో ఉన్నారు., ఇక, ఎన్టీఆర్ అభిమానిగా కూడా గుర్తింపు పొందారు. పార్టీ ఆవిర్భావం నుంచి నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మూడుసార్లు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం.. వివాద రహిత సేవలు అందించడం.. ఆయనకు ప్లస్గా మారుతోంది. వాస్తవానికి 2009లోనే శౌరయ్య టికెట్ ఆశించారు. అయితే.. నిమ్మకాయల రాజనారాయణకు పార్టీ టికెట్ ఇచ్చింది. అయినప్పటికీ.. శౌరయ్య ఆయన విజయం కోసం శ్రమించారు.
అదేవిధంగా పార్టీ నాయకులకు ఆర్థికంగా కూడా సాయం చేస్తూ.. పార్టీ విజయం కోసం.. కృషి చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తనకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వాలనేది శౌరయ్య చేస్తున్న విజ్ఞప్తి. అనేక సంవత్సరాలుగా తాను పార్టీ కోసం కష్టపడుతున్నానని.. ఇప్పటికైనా తనకు సీటు ఇవ్వాలని ఆయన అధినేత చంద్రబాబును కోరుతున్నారు. పార్టీకి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ.. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినా.. తనకు ఎలాంటి పదవులు దక్కలేదని.. ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.