కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో టీకా వికటించి మూడు నెలల పసికందు మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నెమలి సంతోష్ రమ్యలకు ఇద్దరు కుమారులు.. చిన్న కుమారుడైన శివను మూడు నెలల టీకా ఇప్పించడం కోసం స్థానిక అంగన్వాడీ కేంద్రానికి బాబు తల్లి, నానమ్మలు తీసుకెళ్లారు. అక్కడ ఏఎన్ఎం బాబుకు టీకా ఇచ్చింది.
సుమారు మధ్యాహ్నం 12:30 సమయంలో అక్కడినుంచి ఇంటికి వచ్చిన తర్వాత బాబు ఏడవడంతో పాలు ఇచ్చి పడుకోబెట్టింది. సుమారు రెండు గంటల తర్వాత బాబు లేవకపోవడంతో చూడగా శరీరం చల్లగా అయి ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు బాబు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాబును ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాబు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు