హుకుం పేటలో యువకులతో డీఎస్పీ గోవింద రావు అత్యవసర మీటింగ్
విజయనగరం నగరయువత, శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులతో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు హుకుంపేటలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ – శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం, సిరిమాను తరలింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. సిరిమాను తరలింపు సకాలంలో జరిగితే, సిరిమాను ఊరేగింపు నిర్దిష్ట సమయంలోగా పూర్తవుతుందన్నారు.
కావున, కమిటీ సభ్యులు, యువత సకాలంలో సిరిమాను తరలింపుకు సహకరించి, వివిధ ప్రాంతాల నుండి పండగను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పోలీసులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేస్తే, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టవచ్చునన్నారు. సిరిమానోత్సవం రోజున భక్తులు సిరిమాను తరలింపుకు ముందే పూజలు పూర్తి చేసుకొనే విధంగా చూడాలని కమిటీ సభ్యులకు డిఎస్పీ ఆర్.గోవిందరావు సూచించారు.
పండగ నిర్వహణపై కమిటీ సభ్యులతో పలు అంశాలపై డిఎస్పీ ఆర్.గోవిందరావు, టూటౌన్ సిఐ విజయ ఆనంద్ చర్చించి, పండగ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా కమిటీ సభ్యులతో సమన్వయం సాధించారు. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో విజయనగరం టూటౌన్ సిఐ ఎన్.హెచ్.విజయ ఆనంద్, టూటౌన్ ఎస్ఐ షేక్ శంకర్, ప్రధాన పూజారి వెంకటరావు, హుకుంపేట పెద్దలు, యువత, అమ్మవారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.