రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హామీనిచ్చారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో వినోద్ కుమార్ ను కలిసి నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.
కరోనా వైరస్ విజృంభన, లాక్ డౌన్ నేపథ్యంలో నాయీ బ్రాహ్మణులు అన్ని రకాలుగా నష్టపోయిన విషయాన్ని సంఘం నాయకులు వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. నాయీ బ్రాహ్మణుల సమస్యలను తెలుసుకున్న వినోద్ కుమార్ వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు.
నాయీ బ్రాహ్మణుల సమస్యలను దశల వారిగా పరిష్కరించనున్నట్లు వినోద్ కుమార్ హామీనిచ్చారు. లాక్ డౌన్ తో ఆర్థికంగా నష్టపోయిన నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని, విద్యుత్ రాయితీలు కల్పించాలని, పని ముట్లను అందించాలని సంఘ నాయకులు వినతి పత్రంలో కోరారు. వినోద్ కుమార్ ను కలిసిన వారిలో నాయీ సంఘం అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మోహన్, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జీ జితేందర్, తదితరులు ఉన్నారు.