ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని ఓఎస్డీ టి.సాయి మనోహర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన గుండాల మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన దామరతోగులో నివసిస్తున్న 120 కుటుంబాల ప్రజలు గత కొంతకాలంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుసుకుని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ఆదేశాల మేరకు గుండాల పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా ఓఎస్డీ టి.సాయి మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓఎస్డి మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా జిల్లా పోలీసులు పనిచేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే జిల్లా ఎస్పీ సూచనలు మేరకు ఏజెన్సీ వాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం దామరతో గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సుమారుగా 350 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. నలుగురు నిపుణుల వైద్య బృందంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు వైద్య చికిత్సలు చేయించి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గ్రామస్తులందరికీ ఏర్పాటు చేసిన సహపంక్తి విందులో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ రమణమూర్తి, గుండాల సిఐ కరుణాకర్, ఎస్సైలు రాజశేఖర్, శివ ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గోన్నారు.