వలస కూలీలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణం బంగల్ పేట్ శివారు ప్రాంతం నాగనాయి పేట్ లో నివసిస్తున్న ఒరిస్సా, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు చేస్తున్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి వచ్చిన వలస కార్మికులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడనే పనులు చేసుకోవాలన్నారు. లాక్ డౌన్ సందర్భంగా వలస కార్మికులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ 500 నగదు చెల్లించిందని చెప్పారు.
మళ్లీ ఇప్పుడు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 150 మంది వలసకూలీలకు గోధుమపిండి, రవ్వ, కందిపప్పు , నూనె, పల్లీలు, (వేరుశనగ) బొబ్బర్లు పంపిణీ చేశారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎ. భాస్కరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, FSCS చైర్మన్ ధర్మజి రాజేందర్, ఆర్ డి ఓ ప్రసూనాంబ ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రావు, నాయకులు కె. రాంకిషన్ రెడ్డి పాల్గొన్నారు.