పాలిమర్స్ బాధితుల్ని మంత్రి అవంతి శ్రీనివాస్ దారుణంగా అవమానించారని విశాఖపట్నం టిడిపి అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. పాలిమర్స్ బాధితులకు 20 లక్షల పరిహారమే ఎక్కువ అని, రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చిందని మంత్రి అవంతి చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆయన అన్నారు.
అంతే కాకుండా ఆప్తులను కోల్పోయి బాధల్లో ఉన్నవారిని ఇలా వ్యాఖ్యానించవచ్చా అని వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్ చేసినట్లుగా భావించాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మంత్రి అవంతి చేసినవే అయితే, ముఖ్యమంత్రికి వాటితో సంబంధం లేకపోతే కేబినేట్ నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలని వాసుపల్లి డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు జగన్ వే అయితే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన అవంతి నాలుకను కోయాలి..అవంతి ఒక దద్దమ్మ. ఇలాంటి వ్యక్తిని గెలిపించినందుకు..విశాఖ సిగ్గుపడుతోంది. అవంతి లాంటి వ్యక్తి కి మంత్రి పదవి ఇచ్చినందుకు..జగన్ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని వాసుపల్లి వ్యాఖ్యానించారు. తక్షణమే ఎల్ జి పాలిమర్స్ కంపెనీ ని షట్ డౌన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా తో మాట్లాడిన అనంతరం..మంత్రి అవంతి వ్యాఖ్యలను నిరసిస్తూ..పార్టీ కార్యాలయంలో ఒక గంట పాటు వాసుపల్లి మౌన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, రామకృష్ణ బాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు.