నల్గొండ జిల్లా పరిధిలోని పురపాలక సంఘాలపై రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి జరిపిన ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ జిల్లా పరిధిలోని స్థానిక ఎమ్మెల్యేలతో పాటు, పురపాలక సంఘాల చైర్ పర్సన్ లు, పురపాలక సంఘాల కమిషనర్లు, జిల్లా ఎడిషనల్, కలెక్టర్ జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన సాగించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస అవసరాల పైన ప్రధాన దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నల్గొండ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఈ రోజు హైదరాబాదులో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఎన్నడూ లేనంత అధికంగా నిధులు
నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను తూచా తప్పకుండా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పురపాలక సంఘాలకు గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని తెలిపారు.
వీటిని సద్వినియోగం చేసుకొని పురపాలక పట్టణాలలో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనేక సంవత్సరాలుగా నల్గొండ, మిర్యాలగూడ పట్టణాలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేసే దిశగా సహకరిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.
దీంతో పాటు ఆయన పురపాలిక వారీగా ఉన్న అవసరాల మేరకు స్వచ్ఛ వాహనాలను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ప్రతి పట్టణంలో అవసరమైన మేరకు టాయిలెట్ల నిర్మాణం, బస్ బే ల నిర్మాణం వంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టాలన్నారు.
శిథిల భవనాలు కూలితే చైర్మన్ ల దే బాధ్యత
ప్రస్తుతం ఉన్న వర్షాకాల నేపథ్యంలో పట్టణాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే కూల్చివేయాలని ఇలాంటి చోట్ల ప్రమాదాలు జరిగితే స్థానిక చైర్మన్ కమిషనర్ల బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈనెల 29వ తేదీన నల్గొండ జిల్లా పర్యటన చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి బాట పట్టించేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలకు పురపాలక శాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.