పురపాలన పూర్తిగా పౌరుల కేంద్రంగా జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. పురపాలక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత పురపాలక శాఖ కమిషనర్లు, నూతన కార్పోరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం సమావేశం నిర్వహించారు.
పురపాలనలో భాగంగా ప్రజలకు మరింత చేరువ కావాలని ఈ సందర్భంగా వారికి పిలుపునిచ్చారు. నూతన పురపాలక చట్టాన్ని ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ తన విధి నిర్వహణలో జాబ్ చార్ట్ గా పరిగణించాలని కోరారు. పట్టణ ప్రజలు అధికారుల నుంచి అద్భుతాలేమీ ఆశించడం లేదని, కేవలం వారి ప్రాథమిక అవసరాలు, పౌర సేవలందిస్తే సరిపోతుందన్న భావంతో ఉన్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆ దిశగా పని చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు.
అధికార వికేంద్రీకరణే స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అదే స్పూర్తితో ప్రజలకు మరిన్ని పరిపాలన ఫలాలు అందాలన్న లక్ష్యంతో గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కొత్తగా ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు.
వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలంటే స్థానిక కమిషనర్లు తమతో పాటు పనిచేసే సిబ్బందితో, స్థానిక ప్రజలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన పురపాలక చట్టంలోని పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు, పురపాలనలో ఆన్లైన్ సేవలు,టెక్నాలజీ వినియోగం, గ్రీవెన్స్ రిడ్రెస్సెల్, ఎలాంటి అవినీతికి తావులేకుండా భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
మున్సిపల్ కమిషనర్ ఉదయం 4:30గంటలకే పట్టణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాలి అన్నారు. మహిళలకు ప్రత్యేకంగా షీ టాయిలెట్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలిక బడ్జెట్ లో కనీసం పది శాతంతో గ్రీన్ ప్రణాళిక రూపకల్పన చేయాలన్నారు.
ప్రతి పట్టణానికి శానిటేషన్ ప్లాన్ తో పాటు గ్రీన్ ప్లాన్ కూడా తయారు చేయాలని ఆదేశించారు. దీంతోపాటు సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన హెల్త్ ప్లాన్ తయారుచేసి ఉంచాలన్నారు. టీఎస్ బిపాస్ ద్వారా 21 రోజుల్లో ప్రజలకి భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సిందేనని, ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
పురపాలనలో అవినీతి అరికట్టేలా కఠినమైన చట్టాలు, విధానాలు రూపకల్పన చేస్తున్నామని, వీటి అమలులో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా కమిషనర్లతో కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏ అధికారైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలగించే అత్యంత కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో తమందరికీ ప్రజలే అంతిమ బాస్ లు(యాజమానులు)లన్న విషయాన్ని గుర్తుంచుకొని, వారితో బాధ్యతయుతంగా ఉండాలన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను, నాయకులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కేటీఆర్ అన్నారు.