తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్ సి వేతనాలు ఈ నెలకు రావడం లేదు. ఏప్రిల్ నెల జీతం నుంచి పిఆర్ సి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.
దాంతో ఉద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఏప్రిల్ నెల జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సారి కొత్త పీఆర్ సి అమలు చేయడం లేదనే వార్త వారి నెత్తిన పిడుగు పడేలా చేసింది.
పిఆర్ సి అమలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి తుది ఆదేశాలు రావాల్సి ఉంది.
అయితే ఆయనకు ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున అధికారులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రస్తావించడం లేదు.
కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయంపై అడిగినా ఆరోగ్యం బాగా లేని పరిస్థితిలో ముఖ్యమంత్రిగారితో ఈ విషయం ఎలా ప్రస్తావిస్తామనే సమాధానం వచ్చినట్లు తెలిసింది.
ఏతావాతా చూస్తే ఈ నెల జీతంలో పెరుగుదల లేకుండా పోయింది.
పాత వేతనాన్నే ఈ సారి చెల్లించేందుకు ట్రెజరీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
మొత్తం ఉద్యోగులు 2 లక్షల 90 వేల మంది ఉన్నారు.
వచ్చే నెల విషయం ఇప్పుడు చెప్పే వీలు లేదు. లాక్ డౌన్ కనుక అమలు చేస్తే వచ్చే నెల జీతంలో కూడా పెరుగుదల ఉండదు.