రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి బీబీ పాటిల్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం మొత్తంలో 27 వేల మంది ఆశా కార్యకర్తలకు 4జి సిమ్, స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశల మనసు తెల్సుకుని జీతాలను రు. 9750 కి పెంచారని, తెలంగాణ ఏర్పాటుకు ముందు రు. 1500 మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఆశల జీతం రు. 9750 కి చేరిందని ఆయన తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆశా వర్కర్లకు ఇచ్చేది 4 వేలు అయితే.. మన దగ్గర ఇస్తున్నది 9750 అని మంత్రి హరీష్ రావు తెలిపారు.
మరో బీజీపీ రాష్ట్రం మధ్య ప్రదేశ్ లో ఇస్తున్నది రు. 3000, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ రు. 3000 మాత్రమే ఇస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో మూడు నెలలకు ఒక్కసారి జీతాలు వచ్చేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీకు జీతాలు ఇస్తున్నదని హరీష్ రావు తెలిపారు. కామారెడ్డి లో వ్యాక్సినేషన్ బాగా చేశారని, వంద శాతం అయ్యేలా కృషి చేద్దామని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరగాలని మంత్రి తెలిపారు. దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు త్వరలో ఎన్ సి డి కిట్లు అందజేస్తామని ఆయన అన్నారు. ఇలాంటి చర్యల వల్లే ప్రజారోగ్యం లో తెలంగాణ దేశంలో నెంబర్ 3 లో ఉందని ఆయన తెలిపారు.
జి లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం