కార్మిక వర్గ పోరాటాలు చేసిన అమరజీవి కామ్రేడ్ మొకర అప్పారావు నేటి తరానికి ఆదర్శమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. కామ్రేడ్ మొకర అప్పారావు 35 వ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ ( సీపీఐ ) విజయనగరం నియోజకవర్గ సమితి, శాంతినగర్, మార్క్స్ నగర్, బలిజివీధి శాఖల ఆధ్వర్యంలో స్థానిక బలిజివీధిలో జంక్షన్లో ఉన్న అమరజీవి కామ్రేడ్ మొకర అప్పారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బఃగా జరిగిన ఆయన వర్ధంతి సభకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ హాజరై.మాట్లాడారు. కామ్రేడ్ మొకర అప్పారావు ప్రజాసమస్యల పరిష్కారం కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సుదీర్ఘమైన పోరాటాలు నిర్వహించిన పోరాటాల సీపీఐ నేత అని అన్నారు.
సీపీఐ విజయనగరం జిల్లా ద్వితీయ కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో విస్తృతంగా పని చేశారన్నారు. కార్మికోద్యమలు నిర్వహించిన సందర్భంలో జైల్లో ఉన్నప్పటికీ విజయనగరం మున్సిపల్ ఎన్నికల్లో జైలు నుండి కౌన్సిలర్ గా గెలిచి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక సమస్యల పై ప్రశ్నించారన్నారు. మొకర అప్పారావు మొదటి తరం కార్మిక, కమ్యూనిస్టు నేతగా బుగత సూరిబాబు, కృష్ణంరాజు, జగన్నాథం, రాంబాబు, అప్పలరాజు లాంటి రెండో తరం కార్యకర్తలను తీర్చిదిద్దిన వారిలో ఆయన అగ్రగణ్యుడు అన్నారు.
విజయనగరం పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ కి అత్యంత విలువైన నాయకుడిగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే క్రమశిక్షణగల నాయకులు మొకర అప్పారావు అని అన్నారు. ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఎస్ రంగరాజు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో మొకర అప్పారావు గారు స్థాపించిన కార్మిక సంఘం ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతోందని, ఆయన కృషి అద్వితీయం అని కొనియాడారు,కామ్రేడ్ మొకర అప్పారావు గారి ఆశయాలతో మున్సిపల్ రంగంలో ఏ ఐ టి యు సి ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు,
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టీ. జీవన్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజనుల శక్తిని ఉపయోగించుకోకుండా నిర్వీర్యం చేస్తూ,నిరుద్యోగాన్ని అసమానతలను పెంచే విధంగా ప్రైవేటీకరణ విధానాలను అవలంభిస్తున్నది, పెట్టుబడిదారి సమాజానికి సోషలిస్ట్ సమాజమే ప్రత్యామ్నాయమని అన్నారు, కామ్రేడ్ కామ్రేడ్ అప్పారావు గారి ఆశయ సాధనకై ప్రజా పోరాటాల్లో ముందుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అప్పరబోతు జగన్నాథం, పొందూరు రాంబాబు, చిల్లా చిట్టిబాబు రెడ్డి, పొందూరు అప్పలరాజు, గండబోయిన సూరిబాబు, వడ్డాది కొండలరావు, బూర వాసు, వెలగాడ రాజేష్, స్థానిక పెద్దలు తాలాడ గణేష్, కొరగింజ శ్రీను, పిల్లా అప్పులనాయుడు, కరుభుక్త రమణ, అప్పరుబోతు పెంటయ్య, బోని రాజారావు, మద్దిల భగవతిరావు, కాళ్ళ అప్పలగురువులు తదితరులు పాల్గొన్నారు.