తన ఆర్థిక రంగంలో మరింత క్షీణతను నివారించుకోగలిగితే.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది 9.5 శాతం పదునైన మేటి వృద్ధిరేటును నమోదు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తాజాగా వెల్లడించింది. వివిధ ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు కొంత నేల చూపులు చూసినప్పటికీ.. వచ్చే ఏడాదిలో మాత్రం మెరుగైన వృద్ధి నమోదు చేస్తుందనడంలో తమకు సందేహం లేదంటూ ఆ సంస్థ ఒక శుభవార్తను వెల్లడించింది.
మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) సంస్థ కూడా దాదాపు ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత్ దీర్ఘకాలిక విదేశీ, స్థానిక కరెన్సీ సావరిన్ క్రెడిట్ రేటింగ్ ను ఈ సంస్థ కొనసాగించింది. దేశ పెట్టుబడి గ్రేడ్లోనూ స్థిరమైన దృక్పథంను కనబరుస్తూనే.. గతంలో మాదిరి దిగువ రేటింగ్నే ధ్రువీకరించింది.
భారత్ దీర్ఘకాలిక వ్యూహం భేష్
భారత దేశ ఆర్ధికవ్యవస్థను “ఇదే విధమైన ఆదాయ స్థాయిలో సహచరులతో పాటు దీర్ఘకాలిక ప్రదర్శనకారుడిగా” సంస్థ పేర్కొంది. దీనికి తోడుగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి 8.5 శాతంగా ఉండవచ్చని ఈ రేటింట్ సంస్థ అంచనా కట్టింది. దీర్ఘకాలిక రేటింగ్పై భారతదేశ దృక్పథం స్థిరమేనని సంస్థ పేర్కొంది.
కరోనా కారణంగా పెను సవాళ్లు..
దేశంలో కరోనా కట్టడికి గాను చేపట్టిన లాక్డౌన్ భారత ఆర్థిక వృద్ధి పథానికి గణనీయమైన పెను సవాళ్లను తెచ్చిపెట్టిందని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) పేర్కొంది. అయితే 2020 ముగింపు నాటికి దేశ ఆర్థిక వృద్ధి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
మరో వైపు ఫిచ్ సంస్థ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ “కరోనా మహమ్మారి భారతదేశ వృద్ధి దృక్పథాన్ని తీవ్రంగా బలహీనపరిచింది. అధిక ప్రజా-రుణ భారం వల్ల ఎదురయ్యే సవాళ్లు కూడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని కనబరిచింది” అని పేర్కొంది.
కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఈ ఏడాది మార్చి 25న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో లాక్డౌన్ను విధించిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. మన దేశపు ప్రజల ప్రాణాలను కాపాడటమే పరమావధిగా.. వివిధ ఆర్థిక కార్యకలాపాలనూ పక్కన బెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ పలుమార్లు పొడిగించారు. అయితే ఆర్థికాన్ని తిరిగి ప్రారంభించేలా ఈ ఏడాది మే 4వ తేదీ నుండి కొన్ని లాక్డౌన్ పరిమితులు సడలించిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోడీ సంస్కరణలతో మేలు..
ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ ఏజెన్సీలు సమర్పించిన భారతదేశపు వృద్ధి దృక్పథపు నివేదికలు మోడీ ప్రభుత్వ నిర్మాణాత్మక సంస్కరణల కార్యక్రమం సక్రమమేనని ధ్రువీకరించేలా ప్రస్తావనలు చేశాయి. కేంద్రం చేపట్టిన వివిధ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొంటూనే ఆయా సంస్థలు రేటింగ్స్ను ప్రకటించాయని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఊతమిస్తున్న ఆత్మనిర్భర భారత్
ఆత్మ నిర్భర్, భారత్ అభియాన్ ప్యాకేజీలో చేర్చిన సంస్కరణల గురించి రేటింగ్ ఏజెన్సీలు తమతమ విశ్లేషణల్లో ప్రస్తావించడం ఇందుకు ఒక తార్కాణం. ప్యాకేజీలో పలు నిర్మాణాత్మకమైన సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వచ్చే ఏడాది భారత వృద్ధి 8.5 శాతంగా ఉండగలదని ఎస్ అండ్ పీ సంస్థ భారత వృద్ధిని అంచనా కట్టింది.
ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు తక్కువ మొత్తంగానే నమోదు కావొచ్చని.. ఈ రెండు రేటింగ్ ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి. అయితే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేసినందున స్థూల ఆర్థిక అసమతుల్యత లేకుండా అధిక స్థిరమైన పెట్టుబడులు మరియు వృద్ధి రేటు భారత్కు సొంతం కావొచ్చని ఈ రేటింగ్ ఏజెన్సీలు పేర్కొనడం విశేషం.
మొత్తంగా ఈ ఏడాది భారత్ గతంలో మాదిరిగానే రేటింగ్స్ నిర్వహించబడుతుందనడం.. క్లుప్తంగా వీటిని స్థిరంగా ఉంచడం కూడా శుభవార్తే. ముఖ్యంగా ఈ సంవత్సరం బడ్జెట్లో ఉన్న ప్రతిపాదనల కోణం మేరకే ఇవి ఉండడం కూడా మంచి శుభవార్త. ఆయా ఏజెన్సీల రేటింగ్లను బట్టి చూస్తే.. ఇది భారత్ వృద్ది పథంలో మరింత ముందుకు సాగడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.
త్వరగానే కోలుకునే దిశగా అడుగులు..
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధానాన్ని సులభతరం చేసేందుకు గాను తన విధానపరమైన వడ్డీ రేట్లను తగ్గించింది. ఆర్ధిక వ్యవస్థకు తగిన దన్నును అందిచేందుకు గాను దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ల ద్వారా ద్రవ్యతను అందించే చర్యలను ప్రారంభించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివేకంతో మరియు ఆత్మా నిర్భర్, భారత్ అభియాన్ కింద ఐదు ప్యాకేజీల రూపంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అవసరమైన ఉద్దీపనను అందించింది. ఇది మన ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో పయనిస్తూనే.. మనం ఊహించిన దానికంటే త్వరగా కోలుకునే దిశగా అడుగులు వేస్తోందని భావించవచ్చు.