ఏపి ముఖ్యమంత్రి జగన్ పంచన చేరి చంద్రబాబును ఇంతకాలం విమర్శించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నేడు ఆకస్మికంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ సుదీర్ఘంగా సాగింది.
సినీ నటుడిగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు టీడీపీతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్తో అత్యంత సన్నిహితంగా మెలిగిన మోహన్ బాబు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు.
ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా జరిగిన మోహన్ బాబు చంద్రబాబుకు శత్రువుగా మారిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు, ఎన్నికల్లో పార్టీ నుంచి ఎలాంటి అవకాశం దక్కకున్నా పార్టీలోనే కొనసాగారు.
ఈ క్రమంలో వైసీపీతోనూ దూరం పెంచుకున్న మోహన్ బాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, ఇకపై రాజకీయాల జోలికి వెళ్లనంటూ ప్రకటించి సంచలనం రేపారు. అంతేకాకుండా ఇటీవలే తాను బీజేపీ సిద్ధాంతాలను అవలంబించే వ్యక్తిగా తనను తాను ఆయన ప్రకటించుకున్నారు.
ప్రధాని మోడీతో కూడా ఆయన భేటీ అయ్యారు. తాజాగా చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే తన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ సమీపంలో నిర్మించిన సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్ఠాపన, వచ్చే ఆగస్ట్ నెలలో చేయనున్నామని, ఆ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించడానికి మాత్రమే కలిశామని దీనికి ఎటువంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని మోహన్ బాబు వివరణ ఇచ్చారు.