సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్ జాతీయ తల్లి పాల వారోత్సవం కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నేడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, యాదవ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యునిసెఫ్ సంయుక్తంగా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తాయి. కాబోయే తల్లుల్లో, సమాజంలో.. తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్గించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన అన్నారు.
Step Up For Breastfeeding: Educate and Support’ అనే నినాదంతో ఈ వారం పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మన దేశంలో మొదటి గంటలో తల్లి పాలు తాగుతున్న వారి శాతం కేవలం 41. ఈ విషయంలో బంగ్లాదేశ్ 92 శాతం తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేదు. అత్యంత విలువైనవి. విశిష్టమైనది.
తల్లి పాలు తాగడం వలన బిడ్డతో పాటు.. తల్లికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. తల్లి బిడ్డకు ఎంతో మంచి జరుగుతుంది. తల్లి పాలు అందని కారణంగా మన దేశంలో నిమోనియా, నీళ్ళ విరేచనాలతో ఏటా లక్ష మంది పిల్లలు చనిపోతున్నారు. ఏటా ఎంతో మంది తల్లులు రొమ్ము కేన్సర్, అండాశయ కేన్సర్, షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు.
ఇవి రెండు మనం నియంత్రించదగిన విషయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. బిడ్డకు, తల్లికి జరుగుతున్న ఈ నష్టాన్ని ఆపడం మన చేతుల్లోనే ఉందని ఆయన తెలిపారు. మొదటి గంటలో వచ్చే పాలను ముర్రుపాలు (colostrum) అంటారు. ఇవి అమృతం తో సమానం. బిడ్డకు ముర్రుపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధకశక్తి పెరిగి శిశువుకు రోగాలు దరి చేరవు.
ఇది ఒక రకంగా చెప్పాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే మొదటి టీకా ఇది. తల్లి పాలు ఎక్కువ కాలం తాగించడం వల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడతాయు. భవిష్యత్ లో షుగర్, అధిక బరువు, కేన్సర్, ఆస్తమా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉండదనీ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
తల్లి పాలు ఎక్కువ కాలం తాగిన పిల్లల్లో తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయి. తల్లులు చనుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
అయితే తల్లి బిడ్డకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. ముర్రు పాలు అందించక పోవడానికి సిజెరియన్లు కారణం కాగా, వివిధ కారణాలతో ఎక్కువ కాలం పాటు బిడ్డకు చను బాలు ఇవ్వకుండా నేటి కాలంలో కొందరు నిర్లక్యం చూపిస్తున్నారు.
తల్లులు పాలు పట్టలేని నవజాత శిశువులకు, తల్లులు మరణించిన శిశువులకు, అనారోగ్యంతో ఉన్న లేదా తగినంత పాలు అందని శిశువులకు.. లేదా తల్లి పాలను తీసుకోలేని శిశువులకు పాలు అందించాలని మదర్ మిల్క్ బ్యాంక్ లను… సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.
హైదరాబాద్ నీలోఫర్ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేశాము. ఇది విజయవంతం కావడంతో వరంగల్, ఖమ్మంలోనూ మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చాము అని మంత్రి తెలిపారు.