కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళనతో అమరావతి ప్రాంతం అట్టుడికిపోతున్నది. ఉపాధ్యాయుల ఆందోళనపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 20వ తేదీ వరకూ ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
సిపిఎస్ స్థానంలో పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పదే పదే విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరు గర్జన స్కూటర్ ర్యాలీల ముగింపులో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి యుటిఎఫ్ పిలుపునిచ్చింది. ఆదివారం ఉదయం నుండే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు యుటిఎఫ్ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.
విజయవాడలో ప్రకాశం బ్యారేజి, వారధి నుండి కుంచనపల్లి వరకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు దిగ్బంధించారు. సిఎం క్యాంపు కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతాన్ని కూడా పోలీసులు దిగ్బంధించారు. అక్కడ అయిదంచెల భద్రత ఏర్పాటు చేశారు. తనిఖీల కోసం 52 చోట్ల చెక్పోస్టులు పెట్టారు. వెయ్యి మంది పోలీసుల్ని మోహరించారు. 200 మీటర్ల మేర ఇనుప కంచె వేశారు.
తాడేపల్లికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ తనిఖీలు విస్తృతం చేశారు. గుంటూరు జిల్లా పోలీసులతో పాటు రేంజ్ పరిధిలోని ఇతర జిల్లాల నుంచి బలగాలను రప్పించారు. సివిల్, ఏఆర్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ తదితర విభాగాల వారిని విధులకు పిలిపించారు. మారువేషాలు, సాధారణ దుస్తుల్లో పోలీసులు మాటు వేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులకు కార్యక్రమంలో పాల్గొనవద్దని నోటీసులిచ్చారు.
పోలీస్ స్టేషన్ల వద్ద, బస్ స్టేషన్ల వద్ద ఎక్కడికక్కడ అనుమానం ఉన్నవారిని అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో సాధారణ ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలకు వెళ్లాలని సమయం గడిచిపోతుందని కొందరు ప్రయాణీకులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. విజయవాడ నగరానికి వచ్చే రహదారుల్లో ఇబ్రహీంపట్నం, హనుమాన్ జంక్షన్, కంకిపాడు, తాడేపల్లి, మంగళగిరి రహదారులపై గేట్లను ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లించారు. విజయవాడ నగరంలో హోటళ్లు, లాడ్జిలన్నిటినీ తనిఖీ చేస్తున్నారు.