నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పవిత్రమైన రంజాన్ మాసంలో బారా షాహిద్ దర్గాకు 15 కోట్ల రూపాయలను మంజూరు చేయించి ముస్లింల కోసం ప్రత్యేకమైన కానుకగా తెచ్చారని వైసిపి మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్ సలీం కొనియాడారు.
ఎంపీ ఆదాల నివాసంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో ఆదాల కృషితో పాటు ముస్లింల పట్ల ఆయనకు అపారమైన ప్రేమ అనురాగాలు ఉన్నాయని ప్రశంసించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం సిపిఆర్ కళ్యాణ మండపంలో ఎంపీ ఆదాల తన సొంత నిధులతో ఇఫ్తార్ విందు ఇస్తున్నారని తెలిపారు. ముస్లింలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. అక్కడే నమాజ్ తో పాటు విందు ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మైనారిటీ వైసీపీ అధ్యక్షులు షేక్ కంతర్ అలీ మాట్లాడుతూ రూరల్ పరిధిలో ఒక షాది మంజిల్ ను పేదల కోసం నిర్మించాలని ఆయన ఎంపీ ఆదాలకు విజ్ఞప్తి చేశారు. బారా షాహిద్ దర్గాకు నిధులు మంజూరు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి బారాషాహిద్ దర్గా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఇస్మాయిల్ ఖాద్రి ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రియాజ్, సత్తార్ తదితర నేతలు పాల్గొన్నారు.