శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శమని, నేడు అయోధ్యలో నిర్మాణమవుతున్న శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో శ్రీ రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులకు లక్ష రూపాయల నిధి ని ఆయన సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అయోధ్య రామాలయ నిర్మాణానికి సమర్పణ చేసే అదృష్టం మన తరానికి రావడం పూర్వజన్మ సుకృత మేనన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని ప్రపంచం లో హిందువులంతా ఆకాంక్షిస్తున్నారన్నారు.
ఈ మందిర నిర్మాణం కోసం 498 సంవత్సరాలుగా జరిగిన పోరాటం లో లక్షలాది మంది బలిదానాలు, ప్రాణ త్యాగాలు జరిగాయని ఆయన చెప్పారు. గతంలో తాను కూడా అయోధ్యలో తలపెట్టిన కరసేవ లో పాలు పంచుకున్నట్టు తెలిపారు.
అయోధ్యలో నిర్మాణం అవుతున్న శ్రీ రామ మందిరం చరిత్రపుటల్లో నిలిచే విధంగా తీర్చిదిద్దడానికి శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ పనిచేస్తుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జిల్లా సంయోజక కర్త కోమల్ రాజేందర్ రెడ్డి, సహ సంయోజక్ కుమ్మరి కుంట సుధాకర్, నగర సంయోజక్ నిరంజనచారి, దావురి మురళి తదితరులు పాల్గొన్నారు