బీబీనగర్ ఎయిమ్స్లో వసతుల కల్పన కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు న్యూ ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుక్ మండవియా తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తాను అడగగానే ఎయిమ్స్ అభివృద్ది కోసం రూ. 800 కోట్ల పనులకు టెండర్లు పిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు ఎయిమ్స్ విషయంలో తన కృషి ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ను దేశంలోనే నెంబర్ 1 ఆస్పత్రిగా నిలిపేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
అభివృద్దికి నోచుకోకుండా ఉన్న ఎయిమ్స్ పై చాలా సార్లు కేంద్ర మంత్రి, ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. అలాగే కొద్దీ రోజుల క్రితం నూతనంగా ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన మనసుఖ్ మండవియాని కలిసి బీబీనగర్ ఎయిమ్స్ పరిస్థితి వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం రూ.776.13 కోట్లు ఎయిమ్స్ లో భవనాల నిర్మాణానికి కేటాయించారు. అలాగే మరో 23.50 కోట్లు ఎయిమ్స్ నిర్వహణ కొరకు మంజూరు చేశారు.
అలాగే మరో నెల రోజుల్లో 3 వ బ్యాచ్ విద్యార్థులు చేరనున్న నేపథ్యంలో వారి కోసం ఎయిమ్స్ బీబీనగర్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంత్రిని కోరారు. లేదంటే విద్యార్థుల చదువుకు చాలా ఆటంకాలు, ఇబ్బందులు ఉత్పన్నమవుతాయని వివరించారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఎయిమ్స్ బీబీనగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఎయిమ్స్ అభివృద్దికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఎంపీకి తెలిపారు.