ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క తల్లుల పేరు పెట్టాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాంప్లెక్స్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టిన సీఎం కేసీఆర్ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం ఎందుకు చేయలేదు అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మేడారం కి వచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ములుగు కేంద్రంగా సమ్మక్క సారక్క జిల్లా చేస్తానని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీని ఆయన తుంగలో తొక్కారని ముంజల భిక్షపతి అన్నారు. ములుగు కేంద్రంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కొత్తగూడెం కు భద్రాద్రి అని, సిరిసిల్ల జిల్లా కు వేములవాడ రాజన్న, భువనగిరికి యాదాద్రి, గద్వాల్ కు జోగులాంబ అని దేవతల పేర్లు పెట్టిన కేసీఆర్ ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం ఎందుకు చేయలేదు అని బిక్షపతి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి జాతరకు కెసిఆర్ రాలేదని ఆయన అన్నారు. 2022 ఫిబ్రవరి 15న జరిగే మహా జాతర లోపు ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం చేయకుంటే ఉద్యమ కార్యచరణ జనవరి 4వ తేదీన ప్రకటిస్తామని బిక్షపతి తెలిపారు. ఈ సమావేశంలో మారాటి రవీందర్ సదన్న సాంబయ్య సారయ్య రమేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు