ఇన్సూరెన్సు డబ్బుల కోసం సొంత వాహనాన్ని తగులబెట్టుకుని నెపం మావోయిస్టులపైకి నెట్టాలని చూసిన ఒక లారీ ఓనర్ నాటకాన్ని ములుగు జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. 2వ తేదీ ఉదయం ఏడు గంటలకు అంకన్న గూడెం ఊరు చివర ఒక లారీ కాలిపోతున్నదని వెంకటాపురం పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో హుటాహుటిన అక్కడకు వెళ్లిన పోలీసులు మంటలను ఆర్పించి విచారణ ప్రారంభించారు. లారీ ఏ విధంగా కాలిపోయిందో సమాచారం సేకరిస్తుండగా తమ లారీని మావోయిస్టులు కాలబెట్టారని లారీ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అయితే ఆయన చెప్పిన విషయంపై అనుమానం వచ్చి పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. లారీ యజమానిని, క్లీనర్ లను పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. చివరకు తేలిందేమిటంటే ఆ వాహనాన్ని వారు 2019లో ఫైనాన్స్ తీసుకుని వారు కొనుగోలు చేశారు. ఆ తరువాత కరోనా లాక్ డౌన్ కారణంగా సరైన కిరాయిలు లేక నెలవారీ వాయిదాలు కట్టలేకపోయారు.
దాంతో ఏం చేయాలో అర్ధం కాక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కాలబెట్టినట్లయితే దానిని మావోయిస్టులే కాలపెట్టారని అందరూ అనుకుంటారని అప్పుడు పూర్తి ఇన్సూరెన్స్ పొందవచ్చునని భావించారు. వచ్చిన డబ్బులతో ఫైనాన్సు చెల్లించవచ్చునని అనుకుని వారు 1వ తేదీ రాత్రి 11 గంటలకు అంకన్నగుడ సమీపంలోకి లారీని తీసుకెళ్లి వారే డీజిల్ పోసి కాలబెట్టారు.
లారీ తగలబడుతుండగా వారు వెళ్లిపోయారు. తమ నేరాన్ని తామే ఒప్పుకున్నందున వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామని సీఐ వెంకటాపురం శివప్రసాద్ తెలిపారు. సీఐ వెంకటాపురం శివప్రసాద్ మాట్లాడుతూ తప్పుడు మార్గంలో ఇన్సూరెన్స్ పొందాలన్నా ఆలోచనతో తన సొంత లారీని కోల్పోవడమే కాక క్రిమినల్ కేసును కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎవరూ కూడా ఇలాంటి తప్పుడు మార్గంలో నడవద్దని, పోలీస్ డేగ కన్ను నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదని, నిజాయితీతో కష్టపడి ఎదగాలని సిఐ కోరారు.