ఈ నెల 10న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు విశాఖ వెళ్లిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్….అన్ని జిల్లాల కలెక్టర్, ఎస్పీలతో పాటు ఉత్తరాంధ్ర లోని అదీ విజయనగరం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో విశాఖ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో ప్రస్తుత ఎన్నికల వాతావరణాన్ని, అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను, శాంతిభద్రతల పరిస్థితిని, తమ పార్టీ అభిప్రాయాన్ని, సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకొనేందుకు తగిన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్లకు భరోసా కల్పించేందుకు, వారిలో ఎన్నికల పట్ల అవగాహన పెంపొందించేందుకు పలు చర్యలను చేపట్టినట్టు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పార్టీలకు ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే, తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, తగిన చర్యలను తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సిహెచ్.కిషోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, డీఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్డిఓ బిహెచ్ భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రొంగలి పోతన్న, టీడీపీ నుంచి డాక్టర్ కిమిడి నాగార్జున, సీపీఐ నుంచి బుగత అశోక్, బీజేపీ నుంచి రెడ్డి పావని, కాంగ్రెస్ నుంచి సతీష్, సీపీఎం నుంచి కె.సురేష్, జనసేన నుంచి ఆదాడ మోహనరావు, బీఎస్పీ నుంచి పాండ్రంకి వెంకటరమణ, ఆమ్ ఆద్మీ నుంచి కె.దయానంద్ మాట్లాడారు.