మునుగోడు ఉపఎన్నిక పోలీస్ పహరా మధ్య పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రతి పోలింగ్ బూత్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ను పర్యవేక్షిస్తున్నారు. వీటిని నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్రూం, హైదరాబాద్లోని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఉదయం 11 గంటల వరకు 25.80 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే మునుగోడులో మూడు చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తింది. మరొకచోట 20 ఓట్లు పడ్డాక ఈవీఎం మొరాయించింది. వెంటనే మరోదానిని పెట్టారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నికలు ప్రచార గుర్తులు ఉంటే వాటిని తొలగించారు. గత మూడు రోజులు గా నియోజకవర్గంలో పలు చోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్ర పారామిలటరీ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం ఏడు మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలీసులతో భాజపా నేతల వాగ్వాదం
తెరాస శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ మర్రిగూడలో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. గజ్వేల్ తెరాస నాయకులు ఇక్కడ ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సిద్దిపేటకు చెందిన వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. పోలింగ్ నిలిపేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షల నగదు పట్టుబడింది. నగదు తరలిస్తున్న కారును భాజపా శ్రేణులు పట్టుకున్నాయి. చండూరులోనూ రూ.2లక్షల నగదును టిఆర్ఎస్ నేత నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.