ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలపై అధికారులు వారి వారి విధుల నిర్వహణపై పూర్తి అవగాహన కల్గి, ఎక్కడా ఏ చిన్న పొరపాటు లేకుండా సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్ లు, లైజన్, అసిస్టెంట్ లైజన్ అధికారులకు కలెక్టర్ పరీక్షల నిర్వహణపై
మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇదివరకే ఎన్నో పరీక్షలు నిర్వహించిన అనుభవం ఉన్న ప్రతీ పరీక్ష ను మొదటి పరీక్షగా భావించి, ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు, మార్గదర్శకాలను అవగతం చేసుకొని సజావుగా జరిగేలా చూడాలన్నారు. గోడ గడియారాలకు అనుమతి లేదని, ప్రతి అర గంటకు ఒక బెల్లు చొప్పున
కొట్టాలన్నారు. ఇన్విజిలేటర్లు, ప్రెస్కింగ్ బాధ్యులు, టాయిలెట్/త్రాగునీటి బాధ్యుల జాబితా సమర్పించాలన్నారు. మెటల్ డిటెక్టర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పరీక్షా గదులు, చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని, అన్ని సిసి కెమెరాలు పనిచేయు స్థితిలో ఉండేట్లు చూసుకోవాలని ఆయన తెలిపారు.
టాయిలెట్ సైన్ బోర్డులు, పరీక్షా కేంద్రం లే అవుట్ మ్యాపులు ప్రదర్శించాలన్నారు. ఉదయం 9.30 గంటల కల్లా అభ్యర్థులు పరీక్షా కేంద్రం చేరుకోవాలని, పరీక్షా సమయం పూర్తి మ. 1.00 వరకు అభ్యర్థులు ఎవ్వరినీ బయటకు వెళ్లుటకు అనుమతించరని ఆయన అన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్టులను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
అభ్యర్థులు ఒకరోజు ముందుగా పరీక్షా కేంద్రం చూసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రానికి బూట్లు వేసుకొని రావద్దని, చెప్పులు వేసుకొని రావాలని ఆయన తెలిపారు. జిల్లాలో 17,366 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాయనున్నట్లు, 50 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. 11 రూట్లు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఆయన
తెలిపారు. అభ్యర్థుల సౌకర్యం కొరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో డెస్క్, బెంచీలు, త్రాగునీరు తదితర మౌళిక సదుపాయాల కల్పన చూడాలన్నారు. ఆటంకం లేని విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. ఎండాకాలం దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులతో ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం
ఏర్పాటు చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి లేదన్నారు. ఏ దశలో తప్పిదాలకు తావులేకుండా విజయవంతంగా పరీక్ష చేపట్టాలని ఆయన తెలిపారు.