తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనల భజనలను నిషేధించడం అపచారమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి యూత్ హాస్టల్ లో జరిగిన అఖిలపక్ష పార్టీల, వివిధ ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో “వెంకన్న భజన” కాకుండా “వ్యక్తి భజన” చేయాలా? అని ఆయన ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణం బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలలో నాలుగు మాడ వీధులలో శ్రీవారి వాహన సేవ ముందు జానపద కళాకారుల నృత్యాలతో సంకీర్తనలతో సప్తగిరులు పులకరిస్తాయని ఆయన అన్నారు.
తిరుమల కొండ పై అఖండ హరినామ సంకీర్తన జానపద వృత్తి కళాకారులను అనుమతించం అని చెప్పే హక్కు,అధికారం టిటిడి అధికారులకు ఎవరిచ్చారని నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జానపద వృత్తి కళాకారులు తరతరాలుగా తిరుమల శ్రీవారి సేవకు అంకితమై జీవనం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.
టీటీడీ అధికారులకు జానపద కళాకారులంటే చులకన భావం తగదని నవీన్ అన్నారు. టిటిడి లో కొంత మంది అధికారుల తీరు చూస్తుంటే తిరుమల కొండపై “జీయర్ల వ్యవస్థను” సైతం రద్దు చేసి తమ పరపతి కోసం “సొంత వ్యవస్థను” అమలు చేస్తారా అన్న భయం అనుమానాలు వెంకన్న భక్తులలో కలుగుతున్నాయని అన్నారు.
టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ను “ఆధర్మ” ప్రచార పరిషత్ గా మార్చేసి శ్రీవారి నిధులను మంచినీళ్లలా ఖర్చు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. టీటీడీ ధర్మ ప్రచారంలో భాగంగా జానపద వృత్తి కళాకారులను యధావిధిగా తిరుమల కొండపై బ్రహ్మోత్సవాల సమయంలో అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ధర్మకర్తల మండలి చొరవ తీసుకొని అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.