నాగాలాండ్లో దారుణం జరిగింది. మోన్ జిల్లాలో ఉగ్రవాదులనుకొని సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు భద్రతా బలగాలు. జవాన్ల కాల్పుల్లో 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు ప్రజలు. మోన్ జిల్లా తిరు గ్రామానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.
అంతకుముందు నాగాలాండ్లో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడి చేశారు. మోన్ జిల్లా ఓటింగ్ వద్ద జరిగిన ఈ ఘటనలో పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భద్రతా దళాలు సైతం కాల్పులకు తెగబడ్డారు. అయితే, అదే సమయంలో అటుగా వస్తున్న కూలీల వాహనం చూసి ఉగ్రవాదులుగా భావించి కాల్పులు జరిపారు జవాన్లు. కూలీల బృందం తిరు గ్రామం నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనపై నాగాలాండ్ సీఎం నైపూ రియో స్పందించారు. ఇది దురదృష్టకర ఘటన అని వ్యాఖ్యానించారు. అమాయక పౌరులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కాల్పులపై అత్యుతన్నత స్థాయి సిట్ దర్యాప్తు చేస్తుందని.. బాధితులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు నాగాలాండ్ సీఎం. దయచేసి ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.