గత 4 సంవత్సరాల 9 నెలల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యాను. సొంత నిధులతో 27 సంక్షేమ కార్యక్రమాల అమలు చేశాను అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో నారా లోకేష్ నేడు ప్రసంగించారు. గతంలో గ్రామ గ్రామానికి తిరిగి చేనేతలు, స్వర్ణకారులు, బిసిలు, దళితులు, ఎస్టీలు, మైనారిటీల సమస్యలను తెలుసుకున్నాను. యువగళం యాత్రలో అనేక సమస్యలు విన్నపుడు నాకు మంగళగిరి గుర్తు వచ్చేది.
వారు చెప్పే సమస్యలన్నీ నేను మంగళగిరిలోనే తెలుసుకున్నాను. 2019లో గతంలో టిడిపి ఎన్నడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో నేను పోటీచేశాను, ప్రజలు దయచూపలేదు. ఆనాడు లోకేష్ ఏమిటో ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఓడినా నేను నియోజకవర్గాన్ని వీడలేదు అని ఆయన అన్నారు. ఓడినపుడు చాలామంది నన్ను ఎగతాళి చేశారు. మళ్లీ మంగళగిరి నుంచే పోటీచేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారు. మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు. తగ్గేదే లేదని చెప్పాను అని లోకేష్ అన్నారు.
అన్న క్యాంటీన్ల ద్వారా పేదవారి ఆకలి తీర్చాం. పెళ్లి కానుకలు అందజేసాం. స్వయం ఉపాధి కోసం తోపుడు బళ్లు అందించాం. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మెషిన్లు అందించాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా ఉచితంగా వైద్యం, మందులు ఇస్తున్నాం. యువ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ అందిస్తున్నాం అని లోకేష్ వెల్లడించారు. జలధార పేరుతో ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నాం. వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసాం. యువత కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసాం.
టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం అని ఆయన వివరించారు. దివ్యాంగుల కోసం ట్రై సైకిల్స్ ఇచ్చాం. రజక సోదరులకు ఇస్త్రీ బళ్లు అందించాం, స్వర్ణకారులకు లక్ష్మినరసింహ స్వర్ణకార సహకార సంఘం ఏర్పాటు చేసాం. పురోహితులు, పాస్టర్లు, ఇమామ్ లకు పండుగ కానుకలు ఇస్తున్నాం. దళిత బిడ్డల పెళ్లి కి తాళిబొట్లు అందిస్తున్నాం. చేనేత కార్మికులకు రాట్నాలు అందించాం అని ఆయన అన్నారు. రెండుసార్లు వైసిపిని గెలిపించారు. మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలి? ఇప్పుడు ఎమ్మెల్యేనే మారిపోయే పరిస్థితి వచ్చింది.
ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశాక మీడియా మిత్రులతో మాట్లాడుతూ మా సిఎం మంగళగిరి ప్రజలను మోసం చేశాడు అన్నారు. అదే కదా నేను చెబుతున్నది అని లోకేష్ గుర్తు చేశారు. మంగళగిరిని నా కడుపులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఓడిపోయినా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడ్డా. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించా. టిడిపి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం.
నియోజకవర్గంలో ఎసైన్డ్, ప్రభుత్వం, ఇరిగేషన్, ఎండోమెంట్ భూముల్లో దశాబ్ధాలుగా ఎంతోమంది పేదలు నివసిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలో వారి స్థలాలను రెగ్యులరైజ్ చేస్తాం అని లోకేష్ ప్రకటించారు. ఓటర్ వెరిఫికేషన్ పై కేడర్ అంతా దృష్టిసారించాలి. ఇందుకోసం క్లస్టర్, యూనిట్, బూత్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రతి గడపకు వెళ్లి మన హామీలను ప్రజల్లోకి వెళ్లాలి. ఇప్పటికి 52వేల ఇళ్ల వద్దకు వెళ్లారు.
జనవరి కల్లా అన్ని ఇళ్లకు వెళ్లాలి. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని లోకేష్ కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి పలువురు వచ్చినా ఇప్పుడున్న కేడర్ ను కాపాడే బాధ్యత నాది. మనవారిని ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోను. పార్టీ కోసం ఎవరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, మీ బాధ్యత నాది అని లోకేష్ స్పష్టతనిచ్చారు.