తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. ఇప్పటికే కుప్పం చేరుకున్న నారా లోకేష్ రేపు ఉదయం సరిగ్గా 11.03 గంటలకు తన పాదయాత్రలో తొలి అడుగు వేయనున్నారు. కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేసిన నారా లోకేష్ రేపు ఉదయం 10.15 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి స్థానిక వరదరాజుల స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజల అనంతరం 4 వేల కిలోమీటర్ల యువగళం పాదయాత్ర కు సరిగ్గా 11.03 గంటలకు తొలి అడుగు వేయనున్నారు. అనంతరం కుప్పంలో మధ్యాహ్నం 3.00 గంటలకు జరిగే యువగళం సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారు. తొలి రోజు మొత్తం 8.5 కిలోమీటర్ల దూరం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగనుంది. తన పాదయాత్రలో అడుగడుగునా ప్రజలతో మమేకం అవుతూ కార్యకర్తలను పలకరిస్తూ వివిధ వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తూ పాదయాత్ర సాగనుంది.