దారుణ హత్యకు గురైన కోట అనూష కేసులో న్యాయం జరగాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు. కోట అనూష హత్య ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కలచివేసిందని ఆయన అన్నారు.
అనూష దారుణ హత్య ఘటన రోజు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్ పి,డి ఎస్ పి, మీడియా సంస్థలు, పోలీసులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘ నాయకులు స్పందించిన తీరు బాగుందని అయితే దానితోనే న్యాయం జరగదని డాక్టర్ చదలవాడ అన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని ఆయన తెలిపారు. తక్షణమే కోట అనూష కుటుంబానికి ప్రభుత్వం నుండి 10 లక్షల పరిహారం అందచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దానితో బాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని ఆయన కోరారు. స్థానిక అధికార వైసీపీ ఎమ్మెల్యే ఈ సంఘటనపై స్పందించిన తీరు సరిగాలేదని డాక్టర్ చదలవాడ అభిప్రాయపడ్డారు.
ఇది రాజకీయ లబ్ధి కోసం చేసాం అనడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ మాటలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు వింటే ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేసే పరిస్థితి వస్తుందని డాక్టర్ చదలవాడ హెచ్చరించారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరూ అండగా ఉండాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి చేతనైతే సహాయం చేయండి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే కి, వైసిపి నాయకులు కి హెచ్చరిస్తున్నామని డాక్టర్ చదలవాడ తెలిపారు.