ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఎంతో మంది హృదయాలను కలచివేసింది. దేశవ్యాప్తంగా ఈ సంఘటనపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యార్ధి సంఘాలు నిరసన ర్యాలీలు చేపట్టగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఢిల్లీలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు చేపట్టారు.
మరో వైపు షాద్ నగర్ జన సంద్రంగా మారింది. ఆ దుర్మార్గులను తమకు అప్పగించాలని వారికి సహజ న్యాయం చేస్తామని ఆందోళన కారులు నినాదాలు చేశారు. నలుగురు దుర్మార్గులకు మరణ శిక్ష వేయాలని కొందరు డిమాండ్ చేస్తుండగా మరి కొందరు బహిరంగంగా ఉరి తీయాలని కోరుతున్నారు. ఆడ పిల్లలను రక్షించాలంటూ నినాదాలు చేస్తున్నారు.
ఇప్పటికే ప్రజా నాయకులు అందరూ ఈ సంఘటనను ఖండిస్తూ తమ నిరసన తెలిపారు. క్రిమినల్ చట్టాలను సవరించి కేసుల విచారణ వ్యవధి తగ్గిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ హత్యాచారానికి నిరసనగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో శారదా కళాశాల విద్యార్ధులు ర్యాలీ చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.
అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యకు నిరసనగా గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నారై ఇండియన్ ప్రిన్స్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు ర్యాలీలో పాల్గొని సేవ్ గర్ల్ నినాదాలు చేస్తూ.. రోడ్లపై ప్రదర్శన చేపట్టారు. గుంటూరు నగరంలో నోటికి నల్ల రిబ్బన్లతో ర్యాలీ చేపట్టారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలంటే నిందితులకు అక్కడికక్కడే శిక్షలు పడాలని నినదించారు.
ప్రియాంకారెడ్డిని దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తిరుపతిలో విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం నుంచి ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు యువతి చిత్రపటానికి నివాళులు అర్పించారు.
హత్యకు కారకులైన నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో విద్యార్థి సంఘాలు, వైకాపా యువజన సంఘం కార్యకర్తలు మౌన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.