రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులు, అరెస్టులు, పోలీసుల అరాచకత్వంపై ఆరోపణలు వెల్లువెత్తటంతో జాతీయ మహిళా కమిషన్ విచారణ జరుపుతున్నది. జాతీయ మహిళా కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. రాజధానిలో 70 ఏళ్ల వృద్ధురాలిని కూడా పోలీసులు అరెస్టు చేసి దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే.
ఆ వృద్ధురాలి చేతికి ఫ్రాక్చర్ అయింది. అదే విధంగా దాదాపు పది మంది వరకూ మహిళలు సీరియస్ కండిషన్ లో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ అంశాలన్నింటిపైనా జాతీయ మహిళా కమిషన్ విచారణ జరిపే అవకాశం ఉంది. అందుకుగాను జాతీయ మహిళా కమిషన్ బృందం గుంటూరుకు చేరుకుంది. వాస్తవానికి శనివారమే ఈ బృందం రావల్సి ఉండగా వారి పర్యటన నేటికి వాయిదా పడింది.
గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కమిషన్ సభ్యులను నేటి ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఇప్పటికే పలు పత్రికలలో వచ్చిన సమాచారాన్ని సేకరించారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో జరిగిన విషయాన్ని స్వయంగా ఎంపి వివరించారు.