ఉదయగిరి నారాయణ కష్టోడియల్ డెత్ పై నెల్లూరు ఎస్పీకి ఎన్.హెచ్.ఆర్.సీ సమన్లు జారీ చేసింది. ఉదయగిరి నారాయణ అనే దళితుడు నెల్లూరులో 19.06.2022న పోలీసుల చిత్రహింసలకు గురై పోలీస్ కస్టడీలో మరణించిన విషయం అందరికీ విదితమే.
దీనిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య 06.07.2022న జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమిషన్ ఉదయగిరి నారాయణ మరణానికి గల కారణాలు, కస్టోడియల్ డెత్ పై నివేదికను పంపాలని జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ కి పలుమార్లు అడగటం జరిగింది. చివరిసారిగా 19.05.2023నాటికి నివేదిక పంపాలని తుది రిమైండర్ పంపినప్పటికి వారిరువురి నుంచి ఎటువంటి స్పందన లేదు.
దీంతో ఆగ్రహించిన కమిషన్ నెల్లూరు జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ ఇరువురు 25.08.2023 ఉదయం 11 గంటలకల్లా కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది. లేనిపక్షంలో ఆ తేదీనాటికి నివేదిక పంపిన యెడల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తామని సమన్లలో పేర్కొంది.