ఏపీలో కొత్తగ పదకొండు జిల్లా లు ఏర్పాటు కాబోతున్నాయ. ఈ మేరకు ఉత్తరాంధ్ర లో పార్వతీ మన్యం జిల్లా కూడా రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలో పార్వతీపురం కేంద్రంగా రూపుదాల్చనున్న కొత్తజిల్లాకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.
ఏప్రిల్ 4 నుంచి పరిపాలన ప్రారంభం కానున్నందున, కొత్త కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు ఫర్నిచర్ను, అవసరమైన ఇతర సామగ్రిని తమకు కేటాయించిన భవనాలకు తరలించాయి. మరోవైపు నూతన కార్యాలయ భవనాల్లో జరుగుతున్న పనులను ఐటీడీఎ పీవో ఆర్.కూర్మనాధ్ తనిఖీ చేశారు.
కలెక్టరేట్ భవనం, వివిధ కార్యాలయాలకు ఎంపిక చేసిన ఆర్సీఎం స్కూల్ భవనం, గిడ్డంగుల సంస్థ గోదాములు, కలెక్టరేట్ నిర్మాణానికి అడ్డాపుశీల వద్ద గుర్తించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. మిగిలిపోయిన పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో కూర్మనాధ్ మీడియా తో మాట్లాడుతూ, శుక్రవారం సాయంత్రానికి అన్ని కార్యాలయాల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి అవుతాయని చెప్పారు.
కలెక్టర్, జేసీ, డిఆర్వో, సీపీవో, డిపిఆర్వో, ఎన్ఐసి తదితర కార్యాలయాలు కలెక్టరేట్లో ఏర్పాటు కానున్నాయని చెప్పారు. వికలాంగులు సైతం సుళువుగా చేరుకొనే విధంగా స్పందన హాలును గ్రౌండ్ ఫ్లోర్ లొనే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఆర్సీఎం పాఠశాలలో 30 జిల్లా శాఖలకు ఏర్పాటు చేయ నున్న భవనాల పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయని చెప్పారు. ఇక్కడ మహిళలకు, పురుషులకు వేర్వేరుగా నాలుగు టాయిలెట్ బ్లాక్స్, కేంటీన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. నిర్మలా సదన్ తదితరచోట్ల మిగిలిన భవనాల పనులు కూడా పూర్తవుతున్నాయన్నారు.
ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంల్లో వైద్యారోగ్య శాఖ, పశు సంవర్ధక శాఖ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. మొత్తం సుమారు 70 ప్రభుత్వ విభాగాలకు భవనాలను గుర్తించి, ఆయా శాఖలకు కేటాయించడం జరిగిందని పీఓ తెలిపారు.