కొత్త రెవిన్యూ చట్టం నవ శకానికి నాందీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొత్త రెవిన్యూ చట్టం బిల్లు నేడు శాసన మండలి లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి మాట్లాడారు.
సిఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంతో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పూర్తిగా అంతం అయి, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల లో జాప్యం తగ్గిపోతుందని అన్నారు.
నిజాం నాటి కాలం తర్వాత జరుగుతున్న రెవిన్యూ చట్ట సమూల సంస్కరణ ఇదేనన్నారు. అనేక సంస్కరణలతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో జరిగిన విప్లవాత్మక, చరిత్రాత్మక సంస్కరణ ఇది అని ఆయన అన్నారు.
ఈ చట్ట సంస్కరణతో సిఎం కెసిఆర్ ప్రజల, ప్రత్యేకించి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలంగాణను తెచ్చిన భూమి పుత్రుడు, రైతు బాంధవుడిగా మారారని, ఇప్పుడు తాజాగా భూ రక్షకుడిగా నిలిచారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు.
అలాగే సవరణలతో పంచాయతీరాజ్ బిల్లుని కూడా ఆమోదం పొందామని అన్నారు. ఈ బిల్లుతో పంచాయతీల పాత్ర మరింత క్రీయాశీలమవుతుందని మంత్రి అన్నారు.