నడికుడి – శ్రీకాళహస్తి రైలుమార్గం ప్రాజెక్టులో నిర్మాణం పూర్తయిన న్యూ పిడుగురాళ్ల – శావల్యా పురం సెక్షన్లో ఒక రైలుని నడిపేందుకు రైల్వే శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం కాచీగూడ- నడికుడి మధ్యన రాకపోకలు సాగిస్తోన్న డెమూ రైలుని ఈ కొత్తమార్గంలో దొనకొండ వరకు పొడిగించేందుకు ఐఆర్సీటీసీ ప్రతిపాద నల్లో చేర్చింది. హెడ్క్వార్టర్స్ ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేస్తే సాధ్యమై నంత త్వరగా నూతన రైలుమార్గంలో ప్యాసింజర్ రైలు నడుపుతామని రైల్వే వర్గాలు తెలిపాయి.
అలానే మార్కాపురం వరకు ఆ రైలు సర్వీసుని పొడిగించే విషయం ఆలోచన చేస్తామని పేర్కొన్నాయి. గురువారం గుంటూరు పట్టాభిపురంలోని రైల్ వికాస్ భవన్లో జరిగిన ఒకటో డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రైల్వే అధికారులు పైవిధంగా సమాధానం ఇచ్చారు. డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్.మోహన్రాజా అధ్యక్షతన జరిగిన జెడ్ఆర్యూసీసీ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.
ఆదరణ పెరిగిన కొండవీడు ఎక్స్ ప్రెస్
ప్రస్తుతం వారంలో మూడు రోజుల పాటు గుంటూరు డివిజన్ మీదగా రాకపోకలు సాగిస్తున్న కొండవీడు ఎక్స్ప్రెస్కి ప్రయాణీకుల ఆదరణ పెరిగినందున దీనిని నిత్యం నడిపేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. అందుకు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందిస్తూ ఈఅంశాన్ని కూడా ఐఆర్సీటీసీ ప్రతిపాదనలో చేర్చామన్నారు. మహానంది పుణ్యక్షేత్రం నుంచి గాజులపల్లి రైల్వేస్టేషన్ కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నందున అక్కడ నెంబరు. 17228 గుంటూరు-డోన్ ఎక్స్ప్రెస్కి నిలుపుదల సౌకర్యం కల్పించా లని సభ్యులు కోరారు. దీనికి సంబంధించి ప్రతిపాదనని రైల్వేకి పంపామని అధికారులు తెలిపారు. అలానే నెంబరు. 17216 ధర్మవరం – విజయవాడ ఎక్స్ప్రెస్కి మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్లో నిలుపుదల సౌకర్యం కల్పించే ప్రతిపాదన రైల్వే శాఖ పరిశీలనలో ఉందన్నారు.
గుంటూరు – నంద్యాల మార్గంలో కొత్త రైళ్లకు నోగుంటూరు-నంద్యాల రైలుమార్గం ప్రస్తుతం సింగిల్ లేన్గా ఉంది. ఇప్పటికే ఈ మార్గంలో లైన్ సామర్థ్యం 103 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ ఒక్క రైలు నడిపే పరిస్థితి లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఏదైనా రైలుని కొత్తగా ప్రవేశపెట్టినా, ఉన్న రైళ్లలో కొన్నింటిన గమ్యస్థానం పొడిగించినా మూడు గూడ్స్ రైళ్లకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. దీని దృష్ట్యా గుంటూరు – గుంతకల్లు రైలుమార్గం డబ్లింగ్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కొత్త రైళ్ల గురించి ఆలోచన చేస్తామని చెప్పారు. సమావేశంలో డివిజన్ పరిధిలోని రైల్వేస్టేషన్లలో సదుపాయాల కల్పన, ఆర్వోబీల నిర్మాణం, కొత్తగా టిక్కెట్ కౌంటర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. సమావేశంలో ఎన్ ఎండీ జుబేర్బాషాని జెడ్ఆర్యూసీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
ఈ సమావేశంలో ఏడీఆర్ఎంలు ఆర్ శ్రీనివాస్, రామామెహర్, సీనియర్ డీసీఎం వీ ఆంజనేయులు, బ్రాంచ్ అధికారులు భాస్కర్రెడ్డి, జేవీ అనూష, పీ సతీష్, బీ శ్రీనివాసు, కే సత్యహరప్రసాద్, ఏ సీత శ్రీనివాస్, డీఆర్యూసీసీ సభ్యులు సయ్యద్ అమీర్బాషా, ఆర్కేజే నరసింహం, ఎఎండీ జుబేర్బాషా, కే కిషోర్బాబు, సీహెచ్ సురేష్బాబు, పీ వెంకటేశ్వరరావు, జే శ్రీనివాసరావు, ఎం కిష్, సీ జయరామిరెడ్డి, ఎం పోలేశ్వరరావు, కే రవిశంకర్ పాల్గొన్నారు.
మాదిరాజు రామ్మూర్తి, సత్యంన్యూస్.నెట్, గుంటూరు